మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు.

ఎందుకంటే
యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థామ, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు.

అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందినవాడని "చిరంజీవి" అని తెలుసు..


కౌరవుల పక్షంలో "అశ్వత్థాముడు" కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు..

అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు...సభలోని అందరికి నమస్కరించి

అశ్వత్థాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు...


అపుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు.

అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా...

కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వత్థాముడు... కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.


ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వత్థాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా "పాండవుల" గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట యిస్తున్నాను” అన్నట్లు అర్థం చేసుకున్నాడు.

ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు.


కురుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు...

“నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా... నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా!” అని అడిగాడు.


అప్పుడు దుర్యోధనుడు “నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా!” అని అంటాడు..

దీనికి బదులుగా “ఎవరు మాట ఇచ్చింది?” అని అశ్వత్థాముడు అడిగాడు.

అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి....

“ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను, కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు.

నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు..

అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ "పరమాత్మ" పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది!” అని చెప్పాడు అశ్వత్థాముడు.


కనుక అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే....

జీవితాల్లో "దుర్యోధనుడి"లా మనకు ఓటమి తప్పదు..

"అనుమానం పెను భూతం" అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.
0 Comments